04/05/2026
ప్రపంచంలో ఉన్న శైవక్షేత్రాలు అన్నిటిలోని ఆ పరమ శివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ప్రతీ శివలింగం ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉంటుంది. అలానే ఇప్పుడు మనం తెలుసుకోబోయే క్షేత్రం కూడా ఎంతో విశిష్టత కలది. ఈ క్షేత్రంలో మనకి మూడు లింగాలు దర్శనమిస్తాయి.
▪️
▪️
ఈ మహా క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలం, నత్త రామేశ్వరం గ్రామంలో గోస్తనీ నదితీరంలో ఉంది. ఈ ఆలయంలో దక్షిణాభిముఖ, పశ్చిమాభిముఖ శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ భక్తులకు దక్షిణముఖంగా దర్శనమిచ్చే స్వామివారిని నిత్యం దర్శనం చేసుకోవచ్చు కానీ పశ్చిమ ముఖంగా ఉన్న స్వామివారిని మాత్రం వైశాఖ మాసంలో ఒక్క నెలలో మాత్రమే దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. మిగిలిన 11 నెలలు మాత్రం శివలింగం నీటిలోనే ఉంటుంది. ఇలా ఒకే ప్రాంగణంలో శివలింగాలు ఉండటం అనేది చాల అరుదైన విశేషం. ఇక్కడ ఉన్న ఈ రెండు శివలింగాలను ఒకటి శ్రీరాముడు ప్రతిష్టించగా, మరొకటి పరశురాముడు ప్రతిష్టించడం విశేషం. సంవత్సరానికి కేవలం వైశాఖ మాసంలో మాత్రమే దర్శనం ఇచ్చే శివలింగం పరుశరామ ప్రతిష్ట.
▪️
ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం 👇🏻
▪️
🔸️రామ లక్ష్మణులచే లింగ ప్రతిష్ట
▪️
రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించాడు. అయితే ఇక్కడి గోస్తనీ నదితీరం దగ్గరికి వచ్చిన శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించి, ఈ నదిలో మధ్యాహ్నం సమయంలో త్రికోటి తీర్థములు వచ్చి చేరుతాయని నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టించాడు. శ్రీరాముడు ప్రతిష్టించిన లింగాన్ని శ్రీ రామేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈవిధంగా నత్త గుల్లలు కలసిన మట్టితో శివలింగాన్ని ప్రతిష్టించడం వలన ఈ గ్రామానికి నత్తా రామేశ్వరం అనే పేరు వచ్చినదని పురాణాలూ చెపుతున్నాయి. నదికి మరొక పక్క లక్ష్మణుడు కూడా ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. ఈ స్వామివారిని లక్ష్మణేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారు.
▪️
🔸️పరశురామునిచే లింగ ప్రతిష్ట
▪️
పూర్వం గోస్తనీ నదీ తీరంలో పరశురాముడు తొమ్మిది వేల సంవత్సరాలు తపస్సు చేసాడట. అయితే ఎంతో మంది క్షత్రియులను సంహరించిన పరశురాముడు, హత్యల వలన ఏర్పడిన దోషాలను పోగొట్టుకోవడానికి కైలాసం వెళ్లి శివుడి ఆజ్ఞతో పర్వతం నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించాడట. అయితే పరశురాముడి కోపాగ్ని వలన ఆ లింగం అగ్ని లింగం లాగ కనపడేసరికి తన అహంకారం ఇంకా తగ్గలేదేమో అని బాధపడి ఆ శివలింగం చుట్టూ ఒక చెరువును తవ్వి గోస్తనీ నది నీటితో నింపివేసాడట. ఆ తరువాత స్వామి నీవు చల్లబడిన తరువాత నీకు పూజలు ఎలా అని బాధపడుతుంటే, అప్పుడు శివుడు పరశురామ నేను 11 నెలలు నీటిలోనే ఉండి ఒక్క వైశాఖ మాసంలో అందరికి కనిపిస్తాను అని మాట ఇచ్చాడని స్తలపురాణం. అయితే పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడూ కోట్ల మంది సమక్షంలో ప్రతిష్టించాడట అందుకే ఈ శివలింగాన్ని సప్త కోటీశ్వర లింగం అని కూడా అంటారు.
▪️
▪️
ఈ విధంగా ఈ ఆలయంలో 11 నెలలు శివలింగం నీటిలోనే ఉండగా ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీటిని తోడి ఆ నెలలో మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక విషయాలకి నిలయమైన ఈ ఆలయానికి వైశాఖ మాసంలో, శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి శివలింగాలను దర్శనం చేసుకుంటే సిరిసంపదలు లభిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
▪️
▪️
సుదూర ప్రాంతం నుండి వచ్చేవారికి దగ్గర్లో ఉన్న రైల్వే స్టేషన్లు మంచిలి, అత్తిలి, వేల్పూరు, వీరవాసరం, తణుకు ఈ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు.