11/04/2026
తేదీ : 11-04-2026
వనపర్తి జిల్లా
*ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యసన చికిత్స వార్డును ప్రారంభించిన అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్*
యువత మాదకద్రవ్యాల వైపు మల్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి చక్కగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ సూచించారు.
శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యాంటీ డ్రగ్స్ "డ్రగ్స్ ను నిర్మూలిద్దాం" అనే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిజిహెచ్ లో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ వార్డును అదనపు కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వైపు మల్లకుండా భవిష్యత్తుపై దృష్టి సారించి చక్కగా చదువుకోవాలని సూచించారు. నేటి యువతే రేపటి దేశ భాగ్యవిధాతలని, డ్రగ్స్ వల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, మానసిక వికాసం ఆగిపోయి యువ బంగారు భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడం కేవలం ప్రభుత్వం లేదా పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఒకరిపై ఒకరు నిఘా ఉంచుకుని, ఎవరైనా తప్పుదారి పడితే వారిని ప్రేమతో మార్చడానికి ప్రయత్నించాలన్నారు. వైద్య వృత్తి ఎంతో గొప్పదని వైద్యులు సమాజానికి ఉపయోగపడేవిధంగా పని చేయాలన్నారు.
ఈ సందర్బంగా యాంటీ డ్రగ్స్ అంశంపై నిర్వహించిన క్విజ్ మరియు వ్యాసర చిన్న పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.
కార్యక్రమంలో డిఎస్పీ బాలాజీ నాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాయినాథ్ రెడ్డి, సూపరిండెంట్ అరుణకుమారి, ఈగల్ విభాగం డిఎస్పి హరిచంద్ర రెడ్డి, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. Collector Wanaparthy -drugs
Dpro Wanaparthy DPRO Wanaparthy Information & Public Relations Dept, Telangana