04/12/2024
భద్రతా చర్యలు, నేరాల నియంత్రణకు డ్రోన్లను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మల్టీ పర్పస్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్రదర్శించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో, రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ప్రజలకు డ్రోన్ల ద్వారా మందులు చేరవేయాలన్నారు. పంచాయతీలు, మున్సిపాల్టీలో డ్రోన్ల వినియోగం పెంచి ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగవడానికి, దోమల నియంత్రణకు మందుల పిచికారికి పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడవుల్లో కార్చిచ్చు లాంటి ప్రమాదాలను డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి పి. నారాయణ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీఎం కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పెట్టుబడులు మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ పాల్గొన్నారు.