13/10/2024
నాని అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్..!
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నానిల (అ) పవిత్రబంధంపై చంద్రబాబు ఆరా !
ఎమ్మెల్యేలు అందరి ముందు నానిపై మంత్రి లోకేష్ హాట్ కామెంట్!చంద్రబాబు, లోకేష్ లకు తెలిసే నాని అవినీతి అక్రమాలు ఆంధ్రజ్యోతి ద్వారా వెలుగులోకి!
చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు ప్రత్యామ్నాయ చర్యలు!
నాని ఏ పని చెప్పినా ఆచూ తూచి జాగ్రత్తగా చేయండి: జిల్లా అధికారులకు సీఎంవో ఆదేశాలు !
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రాష్ట్రంలో అత్యంత అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలుగా 8 మందిని ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించి రాష్ట్ర ప్రజలు ముందు దోషులుగా నిలిపింది. ఆంద్రజ్యోతి పరిశోధన ప్రకారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యేల జాబితాలో రెండవ స్థానంలోకి ఉన్నట్లు తేలడంపై సర్వత్రా చర్చజరుగుతోంది. నిత్యం తెలుగుదేశం పార్టీకి దిశా, నిర్ధేశం చేసే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైందంటే వారి అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఎవ్వరికైనా అర్థమవుతుంది. చంద్రబాబు, లోకేష్ కు తెలిసే నాని అవినీతి అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్టు సమాచారం. నానికి సంబంధించి ఆశ్చర్యం కలిగించే అనేక విషయాలు చంద్రబాబు, లోకేష్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే...
-గత ప్రభుత్వంలో అప్పటి మైనింగ్ మంత్రి, పులివర్తి నాని సతీమణి సుధారెడ్డికి సమీప బందువు పెద్దిరెడ్డిని అడ్డుపెట్టుకున్న నాని ఐదు ఏళ్లు నిరాటంకంగా తన రెండు క్వారీలను ఒక్కరోజు కూడా మూత పడకుండా కొనసాగించడం, పెద్దిరెడ్డి విద్యుత్ మంత్రిగా కూడా ఉండటంతో కరెంటు బిల్లులు చెల్లించకున్నా సరే తన స్టోన్ పాలీషింగ్ ఫ్యాక్టరీని 5 సంవత్సరాలలో ఒక్క గంట కూడా ఆపకుండా నడపడం, తన ఎన్నికల అఫిడవిట్ లో చూపిన తన 16 గ్రానైట్ ట్రాన్స్ పోర్ట్ లారీలు ఒక్క రోజు కూడా ఎక్కడా ఆగకుండా చెన్నై, బెంగళూరు నగరాలకు గ్రానైట్ రవాణా చేయడం. పాకాల మండలం మద్దినాయుని పల్లి సర్వే నంబర్ 1లో 7 ఎకరాలు కొత్త క్వారీకి పెద్దిరెడ్డిచే అనుమతి తీసుకుని నిరంతర ఆదాయం వచ్చేలా చేసుకోవడం. మొన్న ఎన్నికల్లో మే 7వ తేదీన పెద్దిరెడ్డి ఎం.ఆర్.సి. రెడ్డి ద్వారా రూ.20 కోట్లు నాని ఇంటికి చేర్చడం. ఆ విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎం.ఆర్.సి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, వైసీపీకి చెందిన ఎం.ఆర్.సి రెడ్డి సస్పెండ్ అయితే టీడీపీకి చెందిన నాని ఎం.ఆర్.సిరెడ్డిని సస్పెండ్ చేయడం అన్యాయం, అక్రమం, అధర్మం అంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. ఇలా పెద్దిరెడ్డి, నానిల ఆర్థిక బంధం మరియు అన్యోన్యతా సత్సంబంధాలపై సీఎం చంద్రబాబుకు సమాచారం వెళ్లింది. !
-గత ఐదేళ్లు సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ లు అప్పటి జిల్లా మంత్రి పెద్దిరెడ్డిపై నిరంతర పోరాటం చేస్తుంటే అప్పటి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా వున్న నాని మాత్రం మంత్రి పెద్దిరెడ్డిపై ఒక్క రోజు కూడా, ఒక్క సారి కూడా, ఒక్క మాట కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడూ మాట్లాడక పోవడం, పుంగనూరు ఘటనలో పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలు అందరిపైనా కేసులు పెట్టినప్పటికీ చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా వున్న నానిపై మాత్రం వెంటనే కేసు పెట్టక పోవడం, ఆనాడు పెద్దిరెడ్డితో సన్నిహితులుగా వున్న అనేక మంది ఉద్యోగులకు నేడు పులివర్తి నాని తాను ఎమ్మెల్యేగా వున్న చంద్రగిరి నియోజకవర్గంలో పోస్టింగ్ లు ఇవ్వడం వారిద్ధరి మద్య సత్సంబంధాలను రాష్ట్ర నిఘా వర్గాలు, పలువురు సీనియర్ పాత్రికేయులు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. నాని అవినీతి అక్రమాలతో పాటు నాని పెద్దిరెడ్డిపై చూపుతున్న విధేయతకు సీఎం చంద్రబాబు నానిపై అసహనం వ్యక్తం చేస్తూ పద్దతి మార్చుకోవాలని ఫైర్ అయినట్టు సమాచారం. !
అప్పుడు పెద్దిరెడ్డి (అ) పవిత్ర బంధంతో ఆదాయం పొందిన నాని ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమ సంపాదనలపై ఎక్కువగా దృష్టి పెట్టడం, ఎవరైనా తన మాట వినని వ్యక్తులకు మంత్రి లోకేష్, కిలారి రాజేష్ ల పేర్లు చెప్పి బెదిరించి దారికి తెచ్చుకోవడం. ఏది ఏమైనా భూముల నుంచి బదిలీల వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏ పనికైనా పైసలు వసూలు చేస్తున్న నానిని, అతని నిజ స్వరూపాన్ని, అవినీతి ఆక్రమాలను పరిశోధించిన ఆంధ్రజ్యోతి అక్షర సత్యంగా ప్రజల ముందు పెట్టింది. !
పులివర్తి నానిపై చంద్రబాబు కోపంగా ఉన్నందున ఒక పక్క లడ్డు వివాదం నడుస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో శ్రీవారికి పట్టువస్ర్తాలు ఇచ్చేందుకు తిరుమల వచ్చిన చంద్ర బాబుకు స్థానిక ఎమ్మెల్యేగా వున్న పులివర్తి నాని ప్రోటో కాల్ ప్రకారం స్వాగతం పలకాలి. అయితే నానిపై చంద్రబాబు కోపంగా ఉండటంతో ముఖం చూపించలేక కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది.!
ఈ మద్యన విజయవాడలో మంత్రి లోకేష్ ను పులివర్తి నాని కలసినపుడు పది మంది ఎమ్మెల్యేల సమక్షంలో ‘మీరు గొప్ప నటులు.. సినిమాల్లో నటిస్తే మంచి అవార్డులు సొంతం చేసుకోవచ్చు. సినిమాల్లో ఎందుకు ట్రై చేయలేదు.. రాజకీయాల కన్నా సినిమాల్లో ట్రై చేయండి బ్రహ్మండంగా సక్సెస్ అవుతారు’ అని సెటైర్లు వేశారంటే నాని మాటలు.. నాని చేతలు లోకేష్ మనసును కూడా ఎంతలా బాధించాయో అర్థమవుతోంది. !
తెలుగుదేశం పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని, నిజాయతీగా ఉండాలని ఎన్నిసార్లు హెచ్చరించినా వారు చేసే అవినీతి మాత్రం ఆగలేదని ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు ఏబీఎన్ చానల్ లో కూడా ప్రముఖంగా ప్రసారాలు చేసి ప్రజల ముందుకు తెచ్చారు. అనునిత్యం తెలుగుదేశం పార్టీ శ్రేయస్సును కోరుకునే ఆంధ్రజ్యోతి పత్రిక ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్ లకు తెలియకుండా ఇదంతా ప్రజల ముందుకు తీసుకురాగలదా..? అంటే అలా జరగదనే చెప్పాలి. అయితే చంద్రబాబు మరియు లోకేష్ లు ఇద్దరికీ తెలిసే ఆంధ్రజ్యోతి నాని అవినీతిని బయట పెట్టి ప్రజల ముందు దోషిగా నిలబెట్టినట్టు సమాచారం.!
రాష్ట్ర నిఘా వర్గాల ద్వారా పులివర్తి నాని అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, పెద్దిరెడ్డితో సంబంధాలు గురించి ఆధారాలతో సహా సేకరించుకున్న సీఎంవో అధికారులు జిల్లా అధికారులను అలెర్ట్ చేస్తూ ఎమ్మెల్యే పులివర్తి నాని ఏమి చెప్పినా జాగ్రత్తగా ఒకటికి, రెండు సార్లు ఆలోచించి చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.!
అధికారంలేనపుడు పెద్దిరెడ్డితో అనుబంధం, అధికారం రాగానే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనలో బిజీగా గడుపుతున్న నానిపై టీడీపీ క్యాడర్ మొత్తం నమ్మకం కోల్పోతుండటం వల్ల భవిష్యత్తులో పార్టీకి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన అధినాయకత్వం ప్రత్యమ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది. !
ప్రత్యమ్నాయ చర్యల్లో భాగంగానే చంద్రగిరి నియోజక వర్గం పరిధిలోని ఒక బలమైన సామాజిక వర్గం నుంచి చంద్రగిరి మండలం కొటాలకు చెందిన సీఎం చంద్రబాబుకు సమీప బందువైన రవి నాయుడుకు రాష్ట్ర స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం, ఇదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన మరో ముఖ్య నేతకు తుడా ఛైర్మన్ గా త్వరలో అవకాశం కల్పించి చంద్రగిరి నియోజక వర్గంలో అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేలా ప్రోటోకాల్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకునే బాధ్యతలు కూడా అప్పగించనున్నట్లు సమాచారం.!