07/05/2026
మనోగతం —- కాలాతీత కవి - శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్
- ముప్పవరపు వెంకయ్యనాయుడు
--------------------------
ఈరోజు విశ్వకవి రవీంద్రుని జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆయన కాలంతో పాటే ప్రయాణించారు. అయితే వారి సాహిత్యం మాత్రం కాలప్రవాహంలో కొట్టుకుపోలేదు. సామాజిక సంస్కరణలు, ప్రకృతి ప్రేమ, మానవీయ విలువలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ, అనేక ప్రశ్నలకు సమాధానాన్ని అందిస్తూ... యువతరానికి స్ఫూర్తి పంచుతూనే ఉంది. అందుకే ఆయన కాలాతీత కవి, వారి కవిత్వం కాలాన్ని దాటి ప్రయాణిస్తూ... కాలం విసిరే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తూనే ఉంది.
ఎక్కడ గట్టి నేలలను రైతులు దున్నుతున్నారో...
ఎక్కడ బాటల కోసం కూలీలు రాళ్లు కొడుతున్నారో...
అక్కడ ఈశ్వరుడు ఎండలో, వానలో...
దుమ్ముకొట్టిన బట్టలతో వారి మధ్యన తిరుగుతున్నాడు.
భగవంతుడు ఎక్కడ అని ఎవ్వరు వెతికినా... విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ పంక్తులు చదివితే చాలు. కచ్చితమైన సమాధానం దొరుకుతుంది. దాదాపు 50 ఏళ్ళుగా నాకు ఎలాంటి సందేహం ఎదురైనా, అనేక సందర్భాల్లో నాకు సమాధానం తెలియజేసిన పుస్తకాల్లో భగవద్గీత మొదటిది అయితే, రవీంద్రుని గీతాంజలి రెండవ పుస్తకం. ఈ కవితలన్నీ రవీంద్రుడు తీరిగ్గా కూర్చుని ఆలోచించినవి కావు. సమాజంలో నెలకొన్న వివిధ సానుకూల, ప్రతికూల పరిస్థితుల మధ్య ఓ కవి మనసు పడిన సంఘర్షణ నుంచి గంగా ప్రవాహంలా పుట్టుకొచ్చినవి. అందుకే ఆ జీవధార ఎంతో మంది జ్ఞాన తృష్ణను తీర్చగలిగింది. మరెంతో మంది కవులు దిశానిర్దేశం చేయగలిగింది. ఎన్ని భాషల్లో, ఎన్ని అనువాదాలు వచ్చినా నిత్యనూతనమై అలరారుతోంది. అందుకే రవీంద్రుని సాహిత్యానికి కాలదోషం పట్టదు. ఆయన కాలాతీతమైన కవి. ప్రకృతితో పాటే ఆయన కవిత్వం కూడా భవిష్యత్ తరాల కోసం తలుపులు తెరిచి ఆహ్వానిస్తూ ఉంటుంది.
1913లో భారతదేశ సాహిత్యానికి నోబెల్ పురస్కారాన్ని తీసుకొచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితం ఎంతో ప్రత్యేకమైనది. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆయన, 8 సంవత్సరాల వయసులోనే పద్యాలు రాయడం ప్రారంభించారు. ఆయన మొదటి పద్య సంపుటి భాను సింహను బెంగాలీ పండితులు ఆమోదించలేదు. ఈ సందర్భం నుంచి యువత నేర్చుకోవలసింది ఎంతో ఉంది. తొలి కవిత ఆమోదం పొందకపోయినా, నోబెల్ బహుమతి వరకూ రవీంద్రుని ప్రస్థానం సాగిందంటే... ఆయన ఎన్ని తిరస్కారాలను ఎదుర్కొని ఉంటారు. ప్రతి తిరస్కారం నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుని అంత ఎత్తుకు ఎదిగి ఉంటారో అవగతం చేసుకోవాలి. నాటి బ్రిటీష్ పాలనలో సమాజం ఎదుర్కొంటున్న బాధలను దగ్గర నుంచి చూసిన ఆయన విశ్వమానవతా వికాసాన్ని ఆకాంక్షించారు. మన పెద్దలు ఆచరణలో చూపించిన వసుధైవ కుటుంబక భావన గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
చిన్నతనంలో ప్రకృతి పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాన్ని పెంచుకున్న శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రకృతి ఒడిలోనే విద్యాభ్యాసన పూర్తి చేశారు. చిన్నతనం నుంచే సంగీతం, సాహిత్యం, కళలపై ఆసక్తిని పెంచుకున్నారు. అదే స్ఫూర్తితో, బాలల హృదయాలను వికసింపజేయాలన్న సంకల్పంతో ప్రాచీన ఋషుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్ గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఐదుగురు విద్యార్థులతో మొదలైన ఆ విద్యాసంస్థ క్రమంగా విస్తరించింది. విద్యార్థులు తమ పనులను తామే చేసుకోవడం మొదలుకుని, ఆసక్తులకు అనుగుణంగా విభిన్న కళలలో నైపుణ్యంతో వికాసాన్ని సాధించే విధంగా విద్యను అందించడం ప్రారంభించారు. వారి దృష్టిలో విద్య అంటే పాఠ్యపుస్తకాల్లో ఉన్న మాటలు మాత్రమే కాదు, సమస్త ప్రకృతిలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న స్ఫూర్తి. శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నాటకాలు సమాజాన్ని నేటికీ ఆలోచింపజేస్తాయి. ప్రకృతి ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఆయన రచించిన కవిత్వం, నాటకాలు దిశానిర్దేశం చేస్తాయి.
మహాత్మ గాంధీజీతో పరిచయం రవీంద్రుని జీవితాన్ని, ఆయన సాహిత్యాన్ని నూతన మార్గం వైపు నడిపించింది. ముఖ్యంగా కుల వివక్షను తొలగించడానికి ఆయన చేసిన కృషి మహోన్నతమైనది. అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేయడమే కాదు, భవిష్యత్ తరాలకు అనేక మార్గాలు సూచించారు కూడా. ముఖ్యంగా గ్రామీణ పునర్వీకాసాన్ని సాధించాలన్న సంకల్పంతో వారు స్థాపించిన శ్రీనికేతన్ సంక్షేమ సంస్థ స్ఫూర్తి, స్వాతంత్ర్య భారతంలో గ్రామీణ సాధికారతకు బాటలు వేసింది. వారి సాహిత్యం, ఆలోచనలు, చేపట్టిన కార్యక్రమాలు అన్నీ ఒకే మార్గంలో ముందుకు సాగాయి. వారు కలలుకన్న భవిష్యత్ భారతం వివక్షలకు అతీతమైనది. ప్రకృతి అందాలకు నెలవైనది. వికాసంలోని అసలైన అర్థాన్ని ఆవిష్కరించేది. అందుకే రవీంద్రుని ప్రతి మాటను నేటికీ భారతీయ సమాజం మంత్రంలా భావిస్తూ ఆయన చూపించిన మార్గంలో ముందుకు నడుస్తూనే ఉంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట రవీంద్రునికి చాలా చిన్నది అవుతుందని నా అభిప్రాయం. జీవితాన్ని నేర్చుకోవడంలోనూ, నేర్చుకున్న దాన్ని భవిష్యత్ తరాలకు అందించడంలోనూ ఆయన ముందుకు సాగారు. 1913లో గీతాంజలి కవితా సంపుటికి నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆ సందర్భంలో బ్రిటన్ మహారాణి వారికి నైట్ బిరుదును ప్రదానం చేశారు. అయితే ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ దుర్ఘటన సమయంలో నిరసనగా ఆ బిరుదును త్యజించిన వారి దేశభక్తి నిరుపమానమైనది. వారు రచించిన జనగణమన, భారతీయుల జాతీయ గీతం మాత్రమే కాదు, భారతజాతి సంఘటిత శక్తిని ఆవిష్కరించే గీతం కూడా. సరళమైన పదాల్లో, లోతైన భావాలను ఆవిష్కరించే వారి కవిత్వం ఓ విజ్ఞాన సర్వస్వం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవిత్వంలో నాకు నచ్చిన, స్ఫూర్తినిచ్చిన కవితను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.
ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో...
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో...
ఎక్కడ జ్ఞానం విరివిగా వెల్లివిరుస్తుందో...
ఎక్కడ అలసటనెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో...
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోదో...
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి, పనులలోకి నడుస్తుందో...
ఆ స్వేచ్ఛా స్వర్గానికి...
తండ్రీ... నా దేశాన్ని మేల్కొలుపు
ఇందులోని ప్రతి మాట మన హృదయపు లోతుల్లోకి వెళ్ళాలి. ఇది ప్రార్థన మాత్రమే కాదు. మన సంకల్పం కూడా కావాలి. ప్రపంచ నిర్భయంగా ఉండడం, తలలెత్తుకు తిరగడం, విజ్ఞానం, పరిపూర్ణత... ఇలా ప్రతి ఒక్కటీ నిర్దేశించేది యువతరమే. అందుకే ఈతరం యువత రవీంద్రుని జీవితాన్ని అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా... వారి సాహిత్యం నుంచి స్ఫూర్తిని పొందాలని ఆకాంక్షిస్తున్నాను.