28/03/2026
*🟢చిరు వ్యాపారుల జీవనోపాధిపై రాజకీయాలు వద్దు - SDPI*
నెల్లూరు జిల్లా / తేది: 28.03.2026
మార్చి 27న గొలగమూడి రోడ్లో పశువుల సంత నిర్వహణ జరుగుతుందనే పేరుతో వైసీపీ నెల్లూరు జిల్లా ఇంచార్జ్ & మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కొందరు నాయకులు, గో సంరక్షకుల పేరుతో అక్కడికి వెళ్లి చిన్న వ్యాపారులు, పశువుల కొనుగోలు-అమ్మకాలు చేసుకునే వారిపై ఆరోపణలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించిన ఘటనను SDPI తీవ్రంగా ఖండిస్తోంది.
చట్ట విరుద్ధ చర్యలు జరుగుతున్నాయని అనుమానం ఉంటే సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కానీ రాజకీయ నాయకులు స్వయంగా వెళ్లి మత భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదు. ఇది ప్రజల్లో అనవసర భయాందోళనలు, విభజనలకు దారి తీసే ప్రమాదం ఉంది.
మత విశ్వాసాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం తగదు. ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న మత ఆధారిత రాజకీయాలను దక్షిణ భారతంలో అమలు చేయాలని ప్రయత్నించడం ప్రజలు అంగీకరించరు. చిన్న స్థాయి పశువుల వ్యాపారులను లక్ష్యంగా చేసుకోవడం కంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద స్థాయి మాంసం ఎగుమతులపై ఎందుకు స్పందించడం లేదో స్పష్టం చేయాలి. ప్రపంచంలోనే అత్యధికంగా బీఫ్ ఎగుమతి చేసే దేశాలలో భారత్ ఒకటిగా ఉండటం వాస్తవం.
దీన్ని అరికట్టాలని చెప్పే రాజకీయ నాయకులే ఎన్నికల సమయంలో పెద్ద వ్యాపార సంస్థల నుంచి నిధులు సేకరిస్తున్న విషయం ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా బయటపడింది. అలాంటి పరిస్థితుల్లో చిన్న వ్యాపారులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం ద్వంద్వ వైఖరిని సూచిస్తుంది.
గొలగమూడి రోడ్లో నిజంగా ఏవైనా అక్రమాలు ఉంటే పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ మత భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లాభం పొందే ప్రయత్నాలు నిలిపివేయాలి. ప్రజల మధ్య శాంతి, సామరస్య వాతావరణాన్ని భంగం చేసే చర్యలను SDPI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని SDPI నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఇమామ్ బాషా గారు డిమాండ్ చేశారు.