11/03/2026
*ఉత్సాహంగా మహిళా దినోత్సవ క్రీడలు*
*భారీగా తరలి వచ్చిన ఉద్యోగులు*
*మెదక్:* అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్ పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, టీఎన్జీవోస్ యూనియన్, గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ సహకారంతో మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పోటీలను, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్, జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవిల తో కలిసి ప్రారంభించారు. జ్యూట్ బ్యాగ్ జంపింగ్, మ్యూజికల్ చైర్, త్రెడ్ అండ్ నీడిల్, లెమన్ అండ్ స్పూన్, క్యారమ్స్, స్పీడ్ వాక్, చెస్ మరియు టగ్ ఆఫ్ వార్ క్రీడలు నిర్వహించగా ఉద్యోగులు అసక్తితో ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధికారులు టీఎన్జీవో నాయకులు ఫిజికల్ డైరెక్టర్లు ఉద్యోగులను ఉత్సాహపరిచే విధంగా ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ సంక్షేమ అధికారి హేమ భార్గవిలు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసే విధంగా అదే క్రమంలో విధి నిర్వహణలో ఎంతగానో ఒత్తిడితో పని చేస్తున్న మహిళ ఉద్యోగులకు ఈ ఆటల పోటీలు మానసిక ఉల్లాసాన్ని సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయని మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించామని తెలిపారు. విజేతలకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలలో కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన మరియు క్రీడల శాఖ అధికారి రమేష్, ఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, సహ అధ్యక్షులు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు ఫజల్లుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శి రాధ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంతోష్, సహాధ్యక్షులు శ్రీకాంత్ తదితర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.