08/10/2022
అడుగులు
తడబడ నీయకు , రాహుల్..
నీ కాళ్ళు జాగ్రత్త ,
నీ మోకాళ్ళు జాగ్రత్త
దేశం ఇప్పుడిప్పుడే మళ్ళీ
నీ కాళ్లపై నిలబడేందుకు ప్రయత్నిస్తోంది..
నీ గుండె పదిలం
దేశ ప్రజల హృదయ ఘోషను
అది వినిపించాలి కదా...
నీ గొంతు పదిలం
సంతోషమో, విషాదమో
ఆశో,నిరాశో
పదిమందికీ చేర్చాలి కదా...
కోట్ల మంది పిల్లలకు
ఇప్పుడొక అమ్మవు నువ్వు
అల్లుకు పోవడానికి అందమైన
అను”రాగా”నివి నువ్వు
నీ భుజాలు పదిలం
ఈ దేశపు యువత
నీ భుజాలెక్కి భవిష్యత్తును
చూడాలనుకుంటున్నది..
“ చౌకీ దార్ చోర్ హై,
హమ్ దో హమారే దో” అని
నువ్వు పదేపదే ఘోషించినప్పుడు
దేశం విన్నది కానీ,
ప్రతిధ్వనించలేకపోయింది.
“నలుగురు గుజరాతీలు
మార్కెట్ లో ఉన్నారు
ఇద్దరు అమ్ముతున్నారు,
ఇద్దరు కొంటున్నారు”
అరుంధతీ రాయ్ అన్న మాటలూ
రోజూ నిన్నే గుర్తు చేస్తున్నాయి
--------------
అందరికీ చరిత్ర ఎప్పుడూ
మైమరిపించేలా ఉండదు
చేదు జ్ఞాపకాలనూ
తవ్వి పోస్తుంది – నీకూ అంతే
భవిష్యత్తును కలకనేవాడు
చరిత్ర భారాన్ని మోయవలసే ఉంటుంది
మో – షా ల పాలన క్రూరత్వాన్ని
నువ్విప్పుడు ఎండ గడుతున్నా
దశాబ్ధాల ప్రభుత్వ పాలనలో
నీ పూర్వీకులూ రాజ్య హింసనే నమ్ముకున్నారు
మా జ్ఞాపకాల నిండా
ఆ నెత్తురు ఇంకా
ప్రవహిస్తూనే ఉంది..
తెలంగాణా సాయుధ
రైతాంగ సమరం పై
నెహ్రూ పటేల్ సైన్యం
సాగించిన కవాతూ
ఆదివాసీల జనతన రాజ్యంపై
చిదంబరం సాగించిన ఆకుపచ్చ వేటా
కాశ్మీర్ జాతిపై దశాబ్ధాల దండయాత్రా
ఈశాన్య ప్రాంత భూ ఖండాల దురాక్రమణా
ప్రజాస్వామ్యాన్నే రద్ధు చేసిన
ఎమర్జన్సీ చీకటి పాలన
టాడా, పోటా ల అక్రమ కేసులూ
బూటకపు ఎదురు కాల్పుల్లో
ప్రజా యోధుల హత్యలూ
ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాల రద్ధు లూ ...
ఈ చరిత్రను జ్ఞాపకం చేయడమంటేనే
ఎక్కడో చోట స్వీయ సమీక్ష ఉండాలనే
ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలనే
ప్రజాస్వామ్యానికీ నిరంకుశత్వానికీ
రాజ్యాంగానికీ రాజరిక పోకడలకూ
ప్రభుత్వ పాలన లో మత కార్యకలాపాలకూ
పొంతన కుదరదని ప్రకటింప చేయాలనే
ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యతిరేకి
బిజేపి ప్రజాస్వామ్య వ్యతిరేకి
మొత్తంగా సంఘ్ కూటమి
మానవ సమాజ వర్తమానానికీ ,
భవిష్యత్తుకూ ప్రమాదకారి
మావోయిస్టులు దేశానికి ప్రధాన శత్రువులు అని భావించిన నీ పూర్వీకుల లాగా కాకుండా
ఈ దేశ నిజమైన శత్రువులను స్పష్టంగా గుర్తించావ్
గుండెల్లోకి బాణాన్ని సూటిగా ఎక్కు పెట్టావ్ ... జయహో
మో –షా ల బహిరంగ మద్ధతుతో దేశ సంపద మొత్తం
ఆదానీ ,అంబానీ స్వంత సొత్తుగా మారుతున్న వేళ
ధరలూ , నిరుద్యోగమూ ప్రజలను కుంగ దీస్తున్న వేళ
ప్రతిపక్ష గొంతుకు గోదీ మీడియా సంకెళ్ళు వేస్తున్న వేళ
సాగుతున్న భారత్ జోడో యాత్ర నిత్య సంరంభమే ..