21/09/2018
Good Morning Yellow Army
నవయుగ వైతాళికుడు గురజాడ రాసిన అత్యుత్తమ నాటకం ‘కన్యాశుల్కం’. 'కన్యాశుల్కం' నాటకాన్ని మొదటిసారిగా విజయనగరంలో 1892 ఆగస్టు 13న జగన్నాథ విలాసినీ సభ వారు ప్రదర్శించారు. తర్వాత వందలకొద్దీ ప్రదర్శనలు జరిగాయి.
నాటకం ఆధారంగా వినోదా సంస్థ అధినేత డి.ఎల్. నారాయణ ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు. పి.పులయ్య దర్శకత్వంలో రూపొంది 1955 ఆగష్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రిలీజ్లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాటకం ప్రభావం ప్రేక్షకులపై బాగా ఉండటం చేత, సినిమాతో నాటకాన్ని పోల్చి చూసుకున్నారు ప్రేక్షకులు. విచిత్రం ఏమంటే ఆ తర్వాత చాలాసార్లు విడుదలై, మూడుసార్లు వందరోజులు ప్రదర్శించబడింది కన్యాశుల్కం సినిమా. అలాంటి చరిత్రగల ఏకైక తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’. ‘కన్యాశుల్కం’ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్, మధురవాణిగా సావిత్రి అద్భుతంగా నటించారు.
మొదటి రిలీజ్లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్ రన్స్తో విశేషాదరణ పొందడానికి కారణం ఇందులో నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాతి కాలంలో తిరుగులేని స్టార్ ఇమేజీని సొంతం చేసుకోవడమే. చిత్ర నిర్మాణ సమయానికే స్టార్ హీరోగా ఎంతో ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్, గిరీశం వంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసమైతే ఆ పాత్రను అనితరసాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం ఎన్టీఆర్ ప్రతిభకు తార్కాణం.
‘‘తాంబూలాలిచ్చాం తన్నుకుచావండి’’, ‘‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’’, ‘‘నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. మనవాళ్లు ఒట్టి వెధవాయి లోయ్’ ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని పొలిటీషియన్ కాదు’ వంటి నాటకంలోని సంభాషణలు సినిమాలోనూ ఉంచారు. వీటిలో కొన్ని ఎన్టీఆర్ నోట అద్భుతంగా పలికాయి.
ఈ రోజు గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆ సాహితీ సంస్కర్త సేవలను స్మరించుకుందాం.