27/08/2026
తెలంగాణలో "మిస్టర్ తెలంగాణ" బాడీ బిల్డింగ్ పోటీలు – యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు టీడీపీ చొరవ -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్: సెప్టెంబర్ 6న తెలంగాణ సిటీ పార్టీ కార్యాలయంలో "శ్రీ ఎన్టీఆర్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక్ జూనియర్స్ అండ్ ఓపెన్ - మిస్టర్ తెలంగాణ 2026" పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎం. అరవింద్ కుమార్ గౌడ్ ప్రకటించారు. 2026 తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరిట, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు మెన్స్ ఫిజిక్ ఓపెన్ ఛాంపియన్షిప్ పేరిట బహుమతులు, నగదు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అరవింద్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల డీజీపీని కలిసిన సందర్భంగా, పాఠశాల విద్యార్థుల వరకు కూడా చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మత్తు పదార్థాలు అమ్ముతున్నారని పోలీసు అధికారులు తమకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీనిపై సమగ్ర నియంత్రణ వ్యవస్థ తీసుకురావాలని టీడీపీ డిమాండ్ చేసినట్లు, ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశమై మత్తు పదార్థాలు లభించిన పాఠశాలల లైసెన్స్లు రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినట్లు ఆయన గుర్తుచేశారు.
యువతను సరైన మార్గంలో నడిపించేందుకే బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంటనగరాల్లో యువత పెడదారి పట్టకుండా, వారి దృష్టిని ఫిజిక్ మరియు దేహదారుఢ్యంపై కేంద్రీకరించే ఉద్దేశంతో ఈ బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ వివరించారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి యువతే పార్టీని ముందుండి నడిపించిందని, పార్టీకి యువతతో విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు.
గత టీడీపీ పాలనలో స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాటు, గచ్చిబౌలిలో 167 ఎకరాల్లో బాలయోగి స్టేడియం స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన గుర్తుచేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.160 కోట్లతో 7 స్టేడియంలు నిర్మించడంతోపాటు, ఫతే మైదాన్ అథ్లెటిక్ స్టేడియం అభివృద్ధికి రూ.15 కోట్లతో రెండు మినీ స్టేడియంలు, 13 క్రీడా మైదానాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బాలయోగి స్టేడియం, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ఉప్పల్ స్టేడియం వంటివి టిడిపి హయాంలోనే నిర్మించామని, నేడు జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లన్నీ ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే 2002-03లో ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ను బాలయోగి స్టేడియం వేదికగా విజయవంతంగా నిర్వహించి, హైదరాబాద్కు విశ్వనగర ఖ్యాతిని తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. హైటెక్ సిటీ, ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి సంస్థల ద్వారా విద్య, ఉద్యోగావకాశాల పరంగా యువతకు టీడీపీ ప్రభుత్వం ఎనలేని అవకాశాలు అందించిందని వివరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నగర పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు అరవింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, మాజీ కార్పోరేటర్ పి.బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, భవాని శ్రీనివాస్, వైఎల్.నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.