27/03/2026
శ్రీరామనవమి పండుగ అంటే ఒకప్పుడు పల్లెల్లో సాయంత్రం వేళ కనిపించే ఆ పచ్చని "వేపాకుల గుడి" సందడి ఇప్పుడు కేవలం ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోతోంది.
ఆ రోజుల్లో సాయంత్రం కాగానే చిన్నారులందరూ గుంపులు గుంపులుగా చేరి, తాజా వేప రెమ్మలతో ఒక చిన్న గుడిని తయారు చేసేవారు. ఆ వేపాకుల గుడిని చేతబట్టుకుని వీధివీధికీ తిరుగుతూ, "శ్రీరామ జయరామ జయజయరామ" అంటూ భక్తితో పాడుతుంటే ఆ పల్లె వీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోయేవి. ఆ పసివాళ్ల గొంతుల్లోని రామనామం ప్రతి ఇంటి గడపను తట్టి పండుగ ఉత్సాహాన్ని నింపేది. పిల్లలు తమ ఇంటి ముందుకు రాగానే గృహిణులు ఎంతో ఆదరంగా ఆహ్వానించి, ఆ వేపాకుల గుడిపై నీళ్లు చల్లి మొక్కుకునేవారు. ఆ వేపాకుల గుడి తమ ఇంటికి వస్తే శుభం జరుగుతుందని నమ్మే పెద్దలు, ఆ పిల్లలకు దోసెడు బియ్యం, చేతికి అందినంత చిల్లర డబ్బులను కానుకగా ఇచ్చేవారు.
అలా వారం పది రోజుల పాటు సాయంత్రం పూట కష్టపడి సేకరించిన ఆ బియ్యాన్ని, చిల్లరను పిల్లలందరూ ఒకచోట ఎంతో జాగ్రత్తగా దాచుకునేవారు. చివరకు శ్రీరామనవమి పండుగ రోజున ఆ బియ్యం, డబ్బులతో పిల్లలందరూ కలిసి ఒకచోట చేరి పండగ చేసుకునేవారు. సేకరించిన బియ్యంతో పిండివంటలు, తీపి పదార్థాలు వండించుకుని, ఆ చిల్లర డబ్బులతో ఇతర తినుబండారాలు కొనుక్కుని అందరూ కలిసి పంచుకుని తినేవారు. తాము స్వయంగా సేకరించిన వాటితో వండుకున్న ఆ వంటల్లో ఉండే రుచి, ఆ సంతోషం వర్ణనాతీతం. ఆ రోజున ఒక్క గింజ కూడా వదలకుండా, ఒక్క పైసా కూడా మిగల్చకుండా తాము సేకరించిన వనరులన్నింటినీ ఆ ఉత్సవం కోసమే వినియోగించేవారు.
కానీ కాలక్రమేణా ఆ ముచ్చటైన సంప్రదాయం కనుమరుగవుతోంది. నేటి ఆధునిక పోకడల్లో పిల్లలు స్మార్ట్ఫోన్లకు, టీవీలకు పరిమితమైపోతుంటే, పల్లెల్లో కూడా ఆ పాత తరపు వేడుకలు (వెంకట్ ఇమ్మడిశెట్టి) వెలవెలబోతున్నాయి. సాయంత్రం పూట ఇంటింటికీ తిరుగుతూ, రామనామాన్ని స్మరిస్తూ బియ్యం, చిల్లర సేకరించే ఆ అమాయకపు చిన్నారుల సందడి ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు.
కాంక్రీటు జంగిల్స్లో వేప చెట్లు కరువవ్వడం ఒక కారణమైతే, మన సంస్కృతిలోని ఇలాంటి చిరు వేడుకలను భావితరాలకు అందించడంలో మనం వెనుకబడిపోవడం మరో కారణం. ఆత్మీయతతో కూడిన ఆ వేపాకుల గుడి, ఆ రామనామ స్మరణ లేని శ్రీరామనవమి ఇప్పుడు కొంత వెలితిగానే అనిపిస్తోంది. మన కళ్ళముందే కనుమరుగవుతున్న ఇలాంటి అందమైన ఆచారాలను గుర్తు చేసుకోవడం, కాపాడుకోవడం మనందరి బాధ్యత.
వెంకట్ ఇమ్మడిశెట్టి🤚