15/04/2026
మైనారిటీల అభివృద్ధికి చారిత్రాత్మక అడుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీల సమగ్ర అభివృద్ధి, ఉర్దూ భాష పరిరక్షణ మరియు ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 ఉర్దూ అకాడమీ కేంద్రాలకు సుమారు 300 నూతన కంప్యూటర్లను కేటాయిస్తూ, మైనారిటీ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు సాంకేతిక సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మొహమ్మద్ గౌస్ పీర్ గారు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ గారు కూడా పాల్గొని ప్రసంగించారు.
ఈ నిర్ణయం ద్వారా ఉర్దూ అకాడమీ కేంద్రాలు సాంకేతికంగా మరింత బలోపేతం అవుతాయని, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు మరియు ఆధునిక విద్యా అవకాశాలను పొందగలరని తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మైనారిటీ యువతకు సమాన అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే, మైనారిటీ అభివృద్ధి కార్యక్రమాల విజయవంతమైన అమలులో ఆంధ్రప్రదేశ్ న్యాయ & మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ గారి మార్గదర్శకత్వం మరియు నిరంతర సహకారం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మైనారిటీల పట్ల ఉన్న నిబద్ధత వల్లే ఇలాంటి వినూత్న నిర్ణయాలు సాధ్యమవుతున్నాయని, ఉర్దూ భాష అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు.