05/12/2025
తేది.05.12.2025 న
ఉదయగిరి.
🔸గండిపాలెం రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దంపతులు..!
గండిపాలెం డిసెంబర్ 5న
ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయం నుండి సాగునీటి విడుదల కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, వారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారితో కలిసి పాల్గొని గండిపాలెం రిజర్వాయర్ గేట్లను ఎత్తి రైతుల పంట పొలాల కోసం నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు, వారి సతీమణి శ్రీమతి కాకర్ల ప్రవీణ గారు గండిపాలెం ప్రాజెక్ట్ వద్దకు విచ్చేయగా, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, నాయకులు వారిని సాంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలతో గ్రామ ప్రజలు ఉత్సాహంగా స్వాగతం తెలుపుతూ, వారిని ప్రాజెక్ట్ సమీపంలో గల శివాలయానికి తీసుకు వెళ్లి, అక్కడ శివాలయ పురోహితుల పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, దంపతులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు.
అనంతరం గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలు, చీర–సారె సమర్పించి సంప్రదాయరీతిలో పూజలు నిర్వహించారు. పంటలు పుష్కలంగా పండాలని, రైతుల జీవితాలు అభివృద్ధి చెందాలని ఆశీర్వాదాల మధ్య, ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి గండిపాలెం రిజర్వాయర్ నుండి 8 వేల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఈ నీటి విడుదలతో ప్రాంతంలోని వ్యవసాయ భూములకు నీటి సరఫరా మెరుగై, రబీ పంటలకు నీటి కొరత లేకుండా ఉంటుందని అధికారులు, రైతులు స్థానిక నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.