18/08/2025
** పచ్చని పంట పొలాలను కంపెనీలకు కట్టబెడతారా?
__వ్యాసకర్త : కె. ప్రభాకర రెడ్డి, ఎ.పి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Aug 16,2025 04:35
ప్రజా శక్తి
కరేడు! ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలో 18 మజరా గ్రామాలతో ఉన్న గ్రామం. జూన్ 29వ తేదీకి ముందు వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసులకు మాత్రమే పరిచయం. కానీ నేడు కరేడు పేరు రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా వున్నది.
18 గిరిజన, దళిత, మత్స్యకార పల్లెలతో 16 వేల జనాభాతో 11 వేల పైచిలుకు ఓట్లతో నెల్లూరు జిల్లాలో పెద్ద గ్రామ పంచాయతీ కరేడు. పచ్చని పంట పొలాలకు, మామిడి, జీడి మామిడి, అరటి, కొబ్బరి తోటలకు ఆలవాలంగా ఉన్నది. సముద్రానికి కిలోమీటర్ దూరంలోనే 15, 20 అడుగుల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. సముద్రానికి అతి దగ్గరలో ఉన్నా భూగర్భ జలాలు మాత్రం అతి మధురంగా ఉంటూ వేరుశనగ, వరి, చామ, మినుము తదితర అనేక పంటలకు ప్రధాన నీటి వనరుగా ఉంది. 1300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కరేడు గ్రామ చెరువు కరేడు గ్రామ ప్రజలకు మాత్రమే కాకుండా చుట్టూ పది కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండే ఇతర గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తున్న మంచినీటి చెరువుగా ప్రసిద్ధి గాంచింది. ఈ నీరే వారికి జీవనాధారం. జన జీవనానికి, పశుపోషణకు, పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ చెరువు గ్రామ ప్రజల జీవనాడిగా ఉన్నది.
కరేడు గ్రామంలో ఇండోసోల్ సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దాంతో, అనేక కులాలు, మతాల వారందరూ కలిసి అన్యోన్యంగా జీవిస్తున్న కరేడు గ్రామ ప్రజల జీవితాలలో కలకలం రేగింది. గత వైసిపి ప్రభుత్వంలో ఇండోసోల్ సోలార్ పరిశ్రమకు 5 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వం భూములు కేటాయిస్తే ఈ సంస్థ యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కనుకనే వైసిపి ప్రభుత్వం అక్రమంగా ఇండోసోల్ పరిశ్రమకు పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తుందని నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం నాయకులు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. నాడు వద్దన్న ఇండోసోల్ సోలార్ పరిశ్రమ నేడు ముద్దు అయింది. కారణం తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. నాడు వద్దన్న పరిశ్రమను నేడు అక్కడే నిర్మించాలని ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోంది. ఎన్నికల ముందు షిర్డీ సాయి కంపెనీ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 40 కోట్ల రూపాయలు నిధి కింద ఇచ్చిన విషయం నేడు చర్చనీయాంశం అవుతున్నది. షిర్డీ సాయి కంపెనీ ఇచ్చిన 40 కోట్ల ఎన్నికల బాండ్ల నిధికి ప్రతిఫలంగా తెలుగుదేశం ప్రభుత్వం కరేడు గ్రామంలోని 8,458 ఎకరాల పచ్చని పంట పొలాలను ఇండో సోలార్ పరిశ్రమకు కట్టబెడుతోందా? కార్పొరేట్ కంపెనీల మోజులో తెలుగుదేశం ప్రభుత్వం రానున్న తరాలకు ఆహార భద్రతకు ప్రమాదాన్ని తీసుకొస్తున్నది.
కరేడు గ్రామ ప్రజలు వారి కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం సాగిస్తూ సంవత్సరానికి రెండు, మూడు పంటలు పండిస్తున్నారు. ఎంతో తియ్యటి ఉలవపాడు మామిడి పళ్ళను పండించి ప్రజలకిస్తున్నారు. ఇసుక నేలల్లో వేరుశనగ, వరి, చామ, కంద వంటి పంటలను పండిస్తూ లక్షలాది మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. తాపీ మేస్త్రీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, మామిడి, సపోటా కోత కూలీలుగా, కర్ర నరుకు కార్మికులుగా, మత్స్యకారులుగా, ఉప్పు పండించే రైతులుగా ఇలా అనేక విభిన్నమైన నైపుణ్యాలతో ప్రతి ఏటా రాష్ట్ర జిడిపికి 100 కోట్ల రూపాయలకు పైగా సంపదను జోడిస్తున్నారు. పచ్చని పంటలతో ఆహ్లాదకర వాతావరణం కరేడు సొంతం. కరేడు పల్లెల్లో ప్రతి ఊళ్లో వాలీబాల్ కోర్ట్ కనిపిస్తుంది. ప్రతి ఊళ్లో పోలీస్ శాఖలోనూ, ఉపాధ్యాయ వృత్తుల్లోను అనేక ఇతర ప్రభుత్వ శాఖల్లో తమ ప్రతిభతో ఉద్యోగాలు పొందిన యువత కనిపిస్తుంది. అంటే వ్యవసాయం, సముద్రపు వేట, చదువు, ఆటలు అన్నింటినీ పెనవేసుకున్న జీవితాలను ఛిద్రం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందా అనిపిస్తుంది.
తమ పంట పొలాలను సోలార్ పరిశ్రమకు కేటాయించవద్దని తమ ప్రశాంత జీవితాన్ని తమ నుండి దూరం చేయవద్దని వేలాదిమంది ప్రజలు జూన్ 29వ తేదీన కలకత్తా-చెన్నై జాతీయ రహదారిని అనేక గంటలపాటు దిగ్బంధనం చేశారు. జులై 4వ తేదీన జరిగిన గ్రామసభలో నాలుగు వేల మందికి పైగా ప్రజలు పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని, తమ భూములు ఇచ్చేది లేదని, సోలార్ పరిశ్రమ వద్దని ముక్త కంఠంతో సోలార్ పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యుని, రెవెన్యూ యంత్రాంగాన్ని, సోలార్ కంపెనీ ప్రతినిధులను ప్రయోగించి ప్రజల్లో చీలిక తీసుకువచ్చి ఎలాగైనా భూసేకరణ చేపట్టాలని అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తున్నది. బలహీనులుగా ఉన్న వారికి ఆర్థికంగా ఆశ చూపి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. కరేడు భూ పరిరక్షణ ఉద్యమంలో చురుకుగా ఉన్న వారిపైన అక్రమ కేసులు బనాయించి జైలులో నిర్బంధించడం ద్వారా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలను ముక్తకంఠంతో తిప్పికొడుతూ అభేద్యమైన ఐక్యతతో ప్రజలు తమ భూములను కాపాడుకునేందుకు చైతన్యంతో ముందుకు వెళుతున్నారు. కార్పొరేట్ కంపెనీల మోజులో ఉన్న ప్రభుత్వానికి ప్రజల జీవనోపాధి, భవిష్యత్తు తరాల ఆహార భద్రత పట్టటం లేదు. ఎలాగైనా ప్రజల్లో చీలిక తీసుకువచ్చి, అధికారాన్ని ఉపయోగించి ప్రజలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రశాంతంగా ఉన్న కరేడు గ్రామంలో సెక్షన్ 30 అమలులో ఉందని గ్రామస్తులు నలుగురికి మించి కలవకూడదని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, బయటి వారెవరూ గ్రామంలోకి ప్రవేశించకూడదని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.
2013 భూ సేకరణ చట్టం చాలా స్పష్టంగా 80 శాతం మంది రైతులు, ప్రజలు, గ్రామసభ ఆమోదంతోనే భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని చెబుతున్నది. అయినా దానిని తుంగలో తొక్కి పదే పదే గ్రామ సభల పేరుతో తమకు అనుకూలంగా అభిప్రాయ సేకరణకు పూనుకుంటున్నది. జులై 4వ తేదీన జరిగిన గ్రామసభ స్పష్టమైన తీర్మానం చేసినా మళ్లీ గ్రామసభల పేరుతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. రైతుల ప్రయోజనం కంటే కార్పొరేట్ కంపెనీల ప్రయోజనమే తమకు ముఖ్యమంటూ వేలాది ఎకరాల పచ్చని పంట పొలాలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను ఇప్పటికైనా విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అలా కాదని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళితే కరేడు ప్రజలకు అండగా మేమున్నామంటూ రైతు సంఘాలు కదలనున్నాయి. ఈ నెల 18వ తేదీన ‘చలో కరేడు’ నినాదంతో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాల రాష్ట్ర నాయకులు రైతులకు మద్దతుగా కరేడు వెళ్లనున్నారు. ఇప్పటికే అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో 20 మందికి పైగా హైకోర్టు న్యాయవాదులు కరేడు గ్రామ ప్రజలకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. సిపిఎం, సిపిఐ వంటి వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రజాస్వామ్య పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, కార్పొరేట్ అనుకూల, రైతు వ్యతిరేక భూసేకరణ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలలో ప్రభుత్వం సేకరించిన వేలాది ఎకరాలు పరిశ్రమలు పెట్టకుండా వృధాగా ఉంటున్నాయి. ప్రైవేట్ కంపెనీలు తమకు కేటాయించిన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని పరిశ్రమలు పెట్టకుండా, నిధులు మళ్ళించి, ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వకుండా రైతులను, ప్రజలను మోసం చేశాయి. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పరిశ్రమ నిర్మాణం పేరుతో కరేడు గ్రామ ప్రజలను మోసగించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. కాదు, కూడదు అని ప్రభుత్వం ముందుకు వెళితే ఏ త్యాగానికైనా సిద్ధమవుతాం. మా భూములను కాపాడుకుంటాం. పచ్చని పంట పొలాలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ప్రజలు ఐక్యంగా నినదిస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, వ్యవసాయానికి పనికిరాని వేలాది ఎకరాల భూములు ప్రభుత్వానికి అందుబాటులో ఉండగా పచ్చని పంట పొలాలను నాశనం చేయొద్దని…ప్రజలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు చేస్తున్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మొండిగా ప్రభుత్వం ముందుకు వెళితే ప్రతిఘటన తప్పదు. కరేడు ప్రజలు విజయం సాధిస్తారు. పచ్చని పంట పొలాలను కార్పొరేట్ పరం కాకుండా కాపాడుకుంటారు.
వ్యాసకర్త : కె. ప్రభాకర రెడ్డి, ఎ.పి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
About Us