09/08/2024
*ప్రచురణార్థం/ ప్రసారార్థం: తేదీ:09/08/2024*
*కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా*
*క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం!*
-- కార్పొరేట్ లూటర్స్ క్విట్ ఇండియా కార్యక్రమంలో నాయకుల పిలుపు
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఐక్యంగా పోరాడుదామని కార్పొరేట్ లూటర్స్ క్విట్ ఇండియా కార్యక్రమంలో రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జాతీయ పిలుపులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నారాయణగూడ చౌరస్తాలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న కేంద్ర బడ్జెట్ను సవరించాలని ఉపాధిహామీ పథకానికి నిధులు పెంచాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, ఎరువుల సబ్సిడీకి కోతలు నివారించి నిధులు పెంచాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26000లు నిర్ణయించాలని, కార్పొరేట్ విత్తన కంపెనీలకు ప్రభుత్వ నిధులు కేటాయించొద్దని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్య పద్మ, బి. రాము, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, ఆర్. వెంకట్రాములు, ప్రసాదన్న, శంకర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విదేశీ కార్పొరేట్ సంస్థలకు 5% పన్ను రాయితీ ఇచ్చిందని, భడా కార్పొరేట్ కంపెనీలకు విత్తన పరిశోధన సంస్థ నుండి నిధులు కేటాయించేందుకు సిద్ధపడ్డారని అందులో భాగంగానే అమెజాన్, సిన్జెంటా, బేయర్ లాంటి కంపెనీలకు కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా నిధులు ఇచ్చేందుకు సిద్దపడ్డారని అన్నారు. రైతు సంఘాలతో మాట్లాడకుండా విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనూ అని హామీ ఇచ్చి ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధుల్లో కోత పెట్టిందని, ఎరువుల సబ్సిడీకి కూడా కోత పెట్టిందని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన పోరాటం ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో బిజెపికి గుణపాఠం చెప్పినా కూడా పాఠాలు నేర్చుకోవడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేశారు.
కార్మిక సంఘాల నాయకులు బాల్రాజ్, వెంకటేష్, బోస్, శివబాబు, యూసుఫ్, చంద్రశేఖర్, అంజద్ఖాన్, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి తరతరాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కుల్ని కాలరాసిందని అన్నారు. కనీస వేతనం రూ.26000లు నిర్ణయించాలని ఆందోళన చేసిన పట్టించుకోలేదని, పనిగంటలను పోరాడిసాధించుకుంటే వాటిని కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. కేంద్ర బడ్జెట్ను పేదలకు అనుకూలంగా సవరించాలని, బొగ్గు బ్లాక్లను వేలం వేయడాన్ని ఆపాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, నగర అధ్యక్షులు కుమార్, ప్రజా సంఘాల నాయకులు ప్రదీప్, రామకృష్ణ, రామ్చందర్, జి.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.