22/10/2024
డోర్నకల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు
ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎస్పీ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఉదయం డోర్నకల్ పోలీస్ స్టేషన్ పనితీరును పరిశీలించేందుకు ఆకస్మికంగా సందర్శించారు. మొదట పోలీస్ సిబ్బంది యొక్క గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, పలు కేసులలో సీజ్ చేయబడిన వాహనాలు పరిశీలించారు, పోలీస్ సిబ్బంది యూనిఫామ్, టర్న్ అవుట్, కిట్ ఆర్టికల్స్ పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్ లోని మహిళా కానిస్టేబుల్ (రెసెప్షనిస్ట్ )రికార్డులు తనిఖీ చేశారు. మహిళా సహాయక కేంద్రం రికార్డ్స్ పరిశీలించారు, సీసీ కెమెరాల పని తీరును అడిగి తెలుసుకున్నారు, e-cops రైటర్ విధులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే అర్జీల విచారణ కోసం అప్పగించే భాధ్యతలను పోలీస్ అధికారులు సీరియస్ గా తీసుకొని విచారణ చేపట్టాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషి చేయాలని అన్నారు. కేసుల నమోదు విషయంలో తాత్సారం చేయవద్దన్నారు. ప్రతి కేసులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తద్వారా బాధితులకు సరియైన న్యాయం జరుగుతుందని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాలని, సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా నియంత్రించేందుకు రాత్రి గస్తీ, పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై చేపట్టిన విచారణ నివేదికలను, రికార్డులను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బీట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి కావున ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. చివరిగా ఎస్పీ గారి చేతులమీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది.
ఎస్పీ గారి వెంట డీఎస్పీ తిరుపతి రావు, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డీ4సీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డోర్నకల్ ఎస్.హెచ్.ఓ రాజేష్, ఎస్.ఐ వంశీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Telangana State Police TGCyberBureau